టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని, ఇందుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని ఆయన చెప్పారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ డిజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టే విషయంపై న్యాయనిపుణులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరినపైనా కేసులు పెడుతామని ఆయన హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు తన మంతం, ప్రాంతం గురించి చంద్రబాబు మాట్లాడడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. 

ఈశాన్య భారతం నుంచి వచ్చినట్లు తనపై గతంలో చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, తాను ముగ్గరం క్రైస్తవులం కాబట్టి హిందువులకు రక్షణ లేదన్నట్లు చంద్రబాబు ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమేనని ఆయన అన్నారు. మతాలను రెచ్చగొట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కుట్రలు చేస్తున్నారనే అనుమానం ఉందని చెప్పారు. దొంగలు, ఆకతాయిలు చేస్తున్నట్లుగా లేదని అన్నారు. ఘటనల్లో పోలిక ఉన్నందున కుట్ర కోణం ఉన్నట్లు అనుమానం కలుగుతోందని గౌతమ్ సవాంగ్ అన్నారు. 

రామతీర్థం ఆలయం కొండ కింద ఉందని, బోడికొండపై ఉండేది చిన్న ఆలయమేనని చెప్పారు. కింద ఉన్న అసలైన గుడిలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని సీసీ కెమెరాలు కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఈ సమయంలో ఆ ఘటన జరగడం అనుమానం కలిగిస్తోందని ఆయన అన్నారు.