వేదికపైనే వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. అవాక్కైన వైసీపీ నేతలు
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. దీంతో అక్కడే వున్న వైసీపీ నేతలు, అధికారులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీలో వైసీపీ నేతల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీరు విచిత్రంగా వుంటుంది. సీఎం జగన్పై విధేయత చూపించే క్రమంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. తాజాగా ఆయన తీరు మరోసారి వివాదాస్పదమైంది. వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కారు. నారాయణ స్వామి ప్రాతినిథ్యం గంగాధర నెల్లూరు పరిధిలోని పెనుమూరు మండలంలో నిర్మించిన టీటీడీ కళ్యాణమండపం భూమి పూజ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం , ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానంద రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కాళ్లకు నారాయణ స్వామి నమస్కారం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతకుముందు గత వారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుది ఏడుపు గుర్తు అని విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ‘‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’’లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. నవరత్నాలపై చంద్రబాబు ఏడుస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాలు తీసుకున్న ప్రజలు మాత్రం చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ గుర్తు చిరునవ్వు అని.. చంద్రబాబుది ఏడుపు గుర్తు అని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు. చంద్రబాబుతో వున్న వారందరిది రాక్షస మనస్తత్వమన్నారు. జగనే మా నమ్మకం అని 90 శాతం మంది ప్రజలు చెప్పకుంటే తాను రాజకీయాలను వదిలేస్తానని నారాయణ స్వామి సవాల్ విసిరారు.