బాలుడిని ఢీకొట్టిన కేఈ కాన్వాయి, తీవ్రగాయాలు
గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
బాలుడిని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వాహనం ఢీకొట్టిన సంఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని పొలకల్ గ్రామంలో.. డిప్యుటీ సీఎం కాన్వాయి వెళుతుండగా.. అటువైపుగా ఓ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో.. ఆయన కాన్వాయి బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు.