పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి: నీటిలో ఏం లేదన్న సీఎస్
పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ శుక్రవారం కొమిరేపల్లిలో పర్యటించారు. అంతు చిక్కని వ్యాధిపై అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు
పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ శుక్రవారం కొమిరేపల్లిలో పర్యటించారు. అంతు చిక్కని వ్యాధిపై అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇక్కడ మొత్తం 22 కేసులు వచ్చాయని వెల్లడించారు. విచారణ చేపట్టి ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తానని సీఎస్ పేర్కొన్నారు. మంచినీటిలో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు.
ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. కొమిరేపల్లిలో ఇప్పటి వరకు 13 మంది అస్వస్థతకు గురికాగా వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి బాధితుల వద్దకు వచ్చి, పరిస్థితిపై ఆరా తీశారు. మొదట మూర్చ వచ్చి బాధితులు పడిపోతున్నారని స్థానికులు తెలిపారు.
వింత వ్యాధి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలోనూ ఈ వింత వ్యాధి బాధితుల సంఖ్య మరింత పెరిగింది. కొందరు స్పృహ తప్పి పడిపోతున్నారు.