ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సర్వీసును పొడగించింది. దాంతో ఆయన మరో మూడు నెలలు ఏపీ సీఎస్ గా కొనసాగుతారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆయన సర్వీసును జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ సేవలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వాస్తవానికి ఆదిత్యా నాధ్ దాస్ ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ పొడిగింపుతో ఆదిత్యా నాధ్ దాస్ మరో మూడు మాసాల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన తర్వాత ఆదిత్యనాథ్ దాస్ ఆ స్థానంలో నియమితులయ్యారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ గంధం చంద్రుడును బదిలీ చేసింది. 

జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా గంధం చంద్రుడుకు ఆదేశాలు జారీ చేసింది. షన్మోహన్‌కు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు ఎండీగా షగిలి షన్మోహన్ ఉన్నారు