ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ దూకుడుగా వుంటున్నారు. దీనిలో భాగంగా వచ్చే వారం వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన వర్క్ షాప్ నిర్వహించనున్నారు.  

వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా సిద్ధంగా వుండేలా శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేతలతో సమావేశమైన ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. 2024 ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడమే ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే గత ఎన్నికల్లో మాదిరే ఫలితం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేతలు తమ మధ్య వున్న అభిప్రాయ భేదాలను పక్కనబెట్టాలని, కొద్దిపాటి అసంతృప్తి వున్నా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు గురువారం వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, అన్ని నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా పని చేయాలని.. పని చేయలేకపోతే ముందే చెప్పేయాలని జగన్ తేల్చేశారు. మీరు పనిచేస్తున్నారో లేదో పర్యవేక్షించడానికి తన మనుషులు వుంటారని, మీరు పనిచేయకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. పని చేసినవాళ్లకు తగిన గుర్తింపు వుంటుందని జగన్ తెలిపారు. 

Also Read:ఈ నెల 14న గడప గడపకుపై జగన్ సమీక్ష.. సీఎంకు చేరిన ప్రొగ్రెస్ రిపోర్ట్, ఎమ్మెల్యేల్లో టెన్షన్

ఇక ఇదే సమావేశంలో.. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు వుండాలని.. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలని జగన్ సూచించారు. 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీలను 10 రోజుల్లో పూర్తి చేయాలని.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు నాయకుల మానిటరింగ్ బాధ్యతల్ని అప్పగించాలని జగన్ సూచించారు. ఇద్దరిలో ఒక మహిళా నాయకురాలు, ఒక నాయకుడు వుండాలన్నారు. ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతను అబ్జర్వర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.