డిస్టింక్షన్లో గ్రాడ్యుయేషన్ పాసైన జగన్ కుమార్తె... గర్వంగా వుందంటూ సీఎం ట్వీట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ ను డిస్టింక్షన్ లో పాసయ్యారు. దీంతో ట్విట్టర్ ద్వారా కుమార్తెకు విషెస్ తెలియజేశారు జగన్.
వైసీపీ (ysrcp) అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (ys jagan) పుత్రికోత్సాహం కలిగింది. ఆయన కుమార్తె హర్షా రెడ్డి (harsha reddy) ప్యారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో (insead business school) మాస్టర్స్ పూర్తి చేశారు. ఈ వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ , భారతి దంపతులు పాల్గొన్నారు. దీంతో సంతోషంలో ఉబ్బితబ్బిబ్బవుతోన్న జగన్.. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘‘డియర్ హర్షా.. నీ అభివృద్దిని చూడటం అద్భుతమైన జర్నీ.. భగవంతుడు దయ చూపాడు. ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం గర్వంగా వుంది. భగవంతుడు నీకు మంచి చేస్తాడని ఆకాంక్షిస్తున్నానంటూ’’ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. అలాగే హర్షా రెడ్డి, భార్య భారతీలతో కలిసి వున్న ఫోటోను జగన్ జత చేశారు.
ఇకపోతే.. హర్షారెడ్డి స్నాతకోత్సవం కోసం జూన్ 28న ప్యారిస్ కు వెళ్లిన జగన్ దంపతులు తిరిగి జూలై 3న భారత్ కు తిరిగి రానున్నారు. జూలై 4వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన వుండటంతో ఆయనకు జగన్ స్వాగతం పలకనున్నారు.