విశాఖ నార్త్పై సీఎం జగన్ గురి.. కాసేపట్లో కార్యకర్తలతో భేటీ
టీడీపీ గెలిచిన స్థానాలపై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దీనిలో భాగంగా కాసేపట్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.
కాసేపట్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో ఏపీ సీఎం , వైసీపీ వైఎస్ జగన్ భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానంలో ఎలాగైనా గెలవాలనే వ్యూహాలు రచించనున్నారు. విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు జగన్ సునామీలోనూ విశాఖలోని నాలుగు స్థానాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలే గెలవడం వైసీపీ నేతలకు మింగుడు పడలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైజాగ్లో బోణి కొట్టే విధంగా వ్యూహాలకు సీఎం జగన్ పదును పెడుతున్నారు.
ఇకపోతే.. అక్టోబర్ 19న అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతి అడుగూ ఎన్నికల దిశగానే వుండాలన్నారు. అందరం కలిసికట్టుగా 175కి 175 సీట్లు సాధిద్దామన్న ఆయన.. అదేమి పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 19 నెలలలో ఎన్నికలు వస్తున్నాయని సీఎం జగన్ గుర్తుచేశారు. అద్దంకి నియోజకవర్గానికి గడిచిన మూడేళ్లలో రూ.1,081 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు.
ALso Read:175కి 175 సీట్లే మన టార్గెట్.. కష్టపడితే పెద్ద విషయం కాదు : అద్దంకి వైసీపీ కార్యకర్తలతో జగన్
అంతకుముందు ఈ నెల 13న కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని.. ఈరోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధిస్తామని.. దీనిలో భాగంగా గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నామని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని... గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్తున్నారని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో వున్న మనం.. గ్రామ స్థాయిల్లో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నామని జగన్ అన్నారు.