గోదావరి ఉగ్రరూపం: వరద, సహాయక చర్యలపై జగన్ ఆరా
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో వరద పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో వరద పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
గోదావరి వరద నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లుగా జగన్కు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జగన్ ఆదేశించారు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్ని రకాల సౌకర్యాలు అందించాలన్నారు.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని జగన్ సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
అలాగే గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్ధితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు. మరోవైపు కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాలపై జగన్ ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. బాధితులను ఆదుకోవాలని జగన్ ఆదేశించారు.