పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం రేపు బయల్దేరనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే 52వ ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆయన పాల్గొంటారు.  

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రిగే వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే నిమిత్తం జ‌గ‌న్ ఫారిన్ వెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్న ఏపీ ప్ర‌తినిధి బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వ‌హించ‌నున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శుక్ర‌వారం ఉద‌యం 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం బ‌య‌లుదేర‌తారు. సాయంత్రం 6 గంట‌ల స‌మాయానికి ఆయ‌న జ్యూరిచ్ చేరుకుంటారు. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి శుక్ర‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు జ‌గ‌న్ బృందం దావోస్ చేరుకోనుంది. 10 రోజుల పాటు జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లోనే ఉండ‌నున్నారు.

Also Read:jagan davos tour : జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్.. అనుమతించిన కోర్ట్

ఇకపోతే ..ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని (switzerland) దావోస్‌లో (davos) జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు (world economic forum) వెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (ys jagan) సీబీఐ కోర్ట్ (cbi court) అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని సీఎం తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు. దీనిపై సీబీఐ వాదనలు వినిపిస్తూ.. దావోస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి మంజూరు చేయవద్దని కోరింది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్తే కేసు విచారణలో జాప్యం జరుగుతుందని వాదించింది. ఇరు వైపులా వాదనలను పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. 

కాగా..దావోస్‌లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలు.. ఇక్కడి ప్రజల పురోగతి’ అన్న అంశంపై సీఎం జగన్ బృందం పాల్గొననుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) దావోస్ సదస్సుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోగో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో తాము సమావేశం కాబోతున్నామని.. సీఎం జగన్ స్వయంగా వస్తున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై సత్వరమే నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు.