కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో జగన్ భేటీ.. పోలవరంపై చర్చ
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్పై ఆయన చర్చించారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బిజిబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా శనివారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్కు సవరించిన అంచనా వ్యయం నిధులను విడుదల చేయాలని మంత్రిని జగన్ కోరారు.
అంతకుముందు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం జగన్ ప్రసంగించారు. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పురోగమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా వుందని.. ఇందుకోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా వుందని జగన్ వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికాలో ఇది 7.5 శాతానికే పరిమితం అయ్యిందని జగన్ పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం పోర్ట్ ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని.. రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ వరుసగా మూడోసారి దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందని సీఎం తెలిపారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి మంచి స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు.