పార్టీ కార్యక్రమాలపై జగన్ ఫోకస్ .. మండల స్థాయి నేతలతో భేటీకి రెడీ, బెజవాడలో వచ్చే నెలలో కీలక సమావేశం
ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ వుండటంతో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. స్థానిక ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నేతలతో సమావేశం కావాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో దూకుడు పెంచారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. వై నాట్ 175 అని టార్గెట్ పెట్టిన ఆయన నేతలను ప్రజల్లో వుంచేందుకు పలు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాలతో ప్రజలతో ఎక్కువసేపు మమేకమయ్యేలా చూసుకుంటున్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు పెట్టి నేతల పనితీరును విశ్లేషిస్తున్నారు.
తాజాగా పార్టీ కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మండల స్థాయి నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం డిసైడ్ అయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నేతలతో సమావేశం కావాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 9న విజయవాడలో కీలక సమావేశం జరిగే అవకాశం వుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘‘ వై ఏపీ నీడ్స్ జగన్’’ క్యాంపెయిన్ను ముందుకు తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా జగన్ ఎజెండా వుంటుందని అంటున్నారు. ఆ సమావేశానికి 4 వేల మంది వరకు మండల స్థాయి నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALso Read: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ప్రారంభం .. ఇంటి వద్దే ఫ్రీగా పరీక్షలు , మందులు : వైఎస్ జగన్
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా దృష్టి పెట్టిన సీఎం .. ఇకపై మండల స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల సమయం దగ్గర పడుతూ వుండటంతో సంక్షేమ పథకాలు, పాలనను సాగిస్తూనే.. మరోవైపు పార్టీ పటిష్టతపైనా జగన్ ఫోకస్ పెట్టారు.