రేపల్లె: ఒడిశా కూలీలు మృతి.. సీఎం జగన్ పెద్ద మనసు, ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఒడిశా కూలీలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బతుకుతెరువు కోసం ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని జగన్ సూచించారు. అలాగే రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కాగా, లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు కూలీలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు.
Also Read:అర్ధరాత్రి విద్యుత్ వైర్లు తెగిపడి... నిద్రలోనే ఆరుగురి ప్రాణాలు బలి
రాత్రి భోజనాల అనంతరం షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ షెడ్లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తృటిలో తప్పించుకున్నారు.