presidential election 2022 : ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి జగన్.. రేపటి ఏపీ కేబినెట్ భేటీ రద్దు
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. దీంతో రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (ys jagan) రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీయే పక్షాల (nda) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (draupadi murmu) నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ (ap cabinet) భేటీ రద్దయింది.
ఇకపోతే.. రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ఆమె అభ్యర్థిత్వాన్ని స్వాగతించాయని మోడీ పేర్కొన్నారు. ఆయా సమస్యలపై ముర్ముకు మంచి అవగాహన ఉందని ప్రధాని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే... ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్ పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీతో (narendra modi) పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) కూడా సంతకాలు చేయనున్నారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించేందుకు ఢిల్లీ రావాలంటూ ఎన్డీఏ తరఫున సీఎంలుగా కొనసాగుతున్న నేతలకు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ ఆహ్వానం పలికింది.
మరోవైపు.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఓటింగ్ పాయింట్లను గమనిస్తే.. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి కావాల్సిన ఓటింగ్ పాయింట్ లో బీజేపీ కాస్త వెనుకబడి ఉంది. ఇలాంటి తరుణంలో ఏపీలో అధికారంలో వున్న వైసీపీ.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీఏ) తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయ్సాయి రెడ్డి (vijayasai reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు.
ప్రధాని మోడీ మీరు మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారని ముందుగానే చెప్పారంటూ కామెంట్ చేయడంతో పాటు ముర్ముకు శుభాకాంక్షలు సైతం తెలిపారు. దీంతో ఎన్డీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు ఉందని వైకాపా స్పష్టం చేసినట్టైంది. విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.. "NDA ద్వారా రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా నామినేట్ అయినందుకు శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి హృదయపూర్వక అభినందనలు. గౌరవనీయులైన PM@నరేంద్ర మోడీజీ.. మీరు మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారని సరిగ్గానే చెప్పారు. మేడమ్ మీకు మా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.