మీరు భారత్కు, ఇండియన్ ఆర్మీకీ గర్వకారణం : నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022లో సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022లో సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
ఇకపోతే.. ఒరెగాన్ (Oregon)లోని యూజీన్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (Javelin finals)లో నీరజ్ (Neeraj Chopra) చోప్రా చారిత్రాత్మక రజతాన్ని (silver medal) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన నాల్గో ప్రయత్నంతో 88.13 మీటర్ల బెస్ట్ త్రో రెండో స్థానంలో నిలిచారు. అయితే గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ (Anderson Peters) 90.54 మీటర్ల బెస్ట్ త్రోతో స్వర్ణ పతకాన్ని (gold medal) గెలుచుకున్నాడు.
పీటర్స్ తన మొదటి ప్రయత్నంలో 90.21 మీటర్లు విసిరి, ఆపై తన రెండో ప్రయత్నంలో 90.46 మీటర్లతో మెరుగ్గా నిలిచారు. ఆయన తన ఆరో ప్రయత్నంలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ 88.09 మీటర్ల బెస్ట్ త్రోతో కాంస్యం గెలుచుకున్నారు, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 86.86 మీటర్ల బెస్ట్ ప్రయత్నంతో 4వ స్థానంలో నిలిచారు. 2003లో కాంస్యం గెలిచిన లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ (Anju Bobby George) తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర నెలకొల్పారు.
నీరజ్ చోప్రా ఫౌల్ త్రోతో తన ఆట ప్రారంభించాడు. తన రెండో ప్రయత్నంతో 82.39 మీటర్ల దూరం విసిరాడు. ఆయన తన మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరి కొంచెం మెరుగుపడ్డారు. కానీ తన నాల్గో ప్రయత్నంతో 88.13 మీటర్ల త్రోను విసిరి ఏకంగా నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నారు. ఆయన ఐదో, ఆరో ప్రయత్నాలు ఫౌల్ త్రోలు అయ్యాయి.
సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అభినందనలు తెలిపారు. ‘‘ఒరెగాన్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించి నీరజ్ చోప్రా మళ్లీ చరిత్ర సృష్టించాడు. ఆయన 2003లో లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ కాంస్యం తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన 1వ వ్యక్తి మరియు 2వ భారతీయుడు అయ్యాడు. అభినందనలు ’’ అంటూ ట్వీట్ చేశారు.