జగన్ కీలక నిర్ణయం .. రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు, పెద్దల సభకు వైవీ సుబ్బారెడ్డి .. ?
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు (ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాస్ (బలిజ)లను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు ముగ్గురు నేతలకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. త్వరలో వీరి ముగ్గురి పదవీ కాలం ముగియనుండటంతో మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం నేపథ్యంలో మూడు స్థానాలు వైసీపీ దక్కించుకునే అవకాశం వుంది.
అభ్యర్ధుల ఎంపిక విషయంలో జగన్ సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేశారు. ఒక ఎస్సీ అభ్యర్ధికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ముగ్గురు పేర్లను వైసీపీ ప్రకటించనుంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు (ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాస్ (బలిజ)లను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాల అభ్యర్ధుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.