ఆ నిర్ణయంతో అన్యాయం... ఏపీ కోటా పెంచి న్యాయం చేయండి: కేంద్ర మంత్రి గోయల్ ను కోరిన జగన్
మరో రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్.
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే, ఆహారం మరియ ప్రజాపంపిణీ శాఖలమంత్రి పియూష్ గోయల్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. రైల్ భవన్ లో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. మరో రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్.
2015 డిసెంబర్ వరకూ జాతీయ ఆహార భద్రతా చట్టంకింద ఏపీలో 1.29 కోట్ల రేషన్ కార్డులకు 1,85,640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తూ వచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96శాతం కుటుంబాలకు, పట్టణాలు–నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారని జగన్ తెలిపారు. దీనివల్ల కేవలం 0.91 కోట్ల రేషన్ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని... కేటాయింపులను 1,85,640 మెట్రిక్ టన్నుల నుంచి 1,54,148 కి తగ్గించారని కేంద్ర మంత్రికి తెలియజేశారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు.
కర్ణాటకలో రూరల్లో 76.04శాతం అర్బన్లో 49.36శాతం, గుజరాత్లో రూరల్లో 76.64శాతం అర్బన్లో 48.25శాతం, మహారాష్ట్రలో రూరల్లో 76.32శాతం అర్బన్లో 45.34శాతం
కుటుంబాల ప్రాతిపదికన బియ్యం కేటాయిస్తున్నారని... ఆంధ్రప్రదేశ్ కన్నా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ది చెందినా ఎక్కువ కేటాయించారని వివరించారు. ఏపీ కోటాను కూడా పెంచాలని జగన్ కేంద్ర మంత్రిని కోరారు.
ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక కూడా రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని...తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం.
read more ఏపీలో పెట్రో కాంప్లెక్స్... త్వరలోనే విధివిధానాలు..: సీఎం జగన్ కు కేంద్ర మంత్రి హామీ
రేషన్కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించిందని గుర్తుచేశారు. పారదర్శక పద్ధతిలో రాష్ట్రంలో ఇంటింటా సర్వే జరిపి 1.47 కోట్ల రేషన్కార్డు దారులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమలు చేస్తున్న కార్యక్రమానికి అర్హులని తెల్చినట్లు సీఎం తెలిపారు. ఈ వివరాలు అన్నింటినీ కూడా డిజిటలైజేషన్ కూడా చేశామన్నారు సీఎం జగన్. తర్వాత కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని... వీరందరి రేషన్ భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తోందన్నారు. ఇది రాష్ట్రానికి చాలా భారమని... వెంటనే దీన్ని సరిదిద్దాలని కేంద్ర మంత్రిని కోరారు ముఖ్యమంత్రి.
2020–21 రబీ సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని... మద్దతు ధరలను రైతులకు ఇస్తూ సకాలంలో వాటి పేమెంట్లు రైతులకు అందేలా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించిన సీఎం. ఉచిత రేషన్ బియ్యం కింద కేంద్రం, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు రూ,3,229 కోట్ల రూపాయలు బకాయి పడిందని... వాటిని వెంటనే చెల్లించాలని కోరారు జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని... రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే బకాయిల విడుదల అత్యంత అవసరమని కేంద్ర మంత్రికి సీఎం జగన్ వివరించారు.