ఏపీలో పెట్రో కాంప్లెక్స్... త్వరలోనే విధివిధానాలు..: సీఎం జగన్ కు కేంద్ర మంత్రి హామీ
వచ్చేవారం ఏపీ చీఫ్ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తామని జగన్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువుల శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వచ్చేవారం ఏపీ చీఫ్ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలను ఖరారు చేస్తామని జగన్ కు కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
డిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై ఇరువురి మధ్య గంటకుపైగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా... కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని జగన్ సీఎంకు తెలిపారు. ఆ హామీని నెరవేర్చాలని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువుల శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరగా అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారట.
హెచ్పీసీఎల్ – గెయిల్ సంస్థలు కలిసి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ. 32,900 కోట్లు ఖర్చుకాగల ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశామని జగన్ తెలిపారు. అయితే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రం కోరిందని... ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారం మోయలేమన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలిపారు.
ఈ ప్రాజెక్టు విధివిధానాలపై చర్చించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్ గ్రూపు కోసం సభ్యులను నామినేట్ చేశామని... కేంద్ర కూడా చర్చలు ప్రారంభించేలా వెంటనే ఆదేశాలు జారీచేయాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను 25శాతం తగ్గించిందని... అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు కూడా తగ్గాయని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్తో నిమిత్తంలేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. వెంటనే దీనిపై దృష్టిసారించాలని కేంద్ర మంత్రి ప్రధాన్ కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.