ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  

విజయవాడ: రైట్ టూ ఎడ్యుకేషనే కాదు... రైట్ టూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా ఉండాలని తమ ప్రభుత్వం కోరుకొందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు చెప్పారు.

మానవహక్కులు ఎప్పటికప్పుడూ విస్తరిస్తూ మారుతున్నాయన్నారు.హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు.రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలు కోరుకొంటున్నారని ఆయన చెప్పారు. 

 రెండేళ్లుగా ప్రజల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకొనే సమయం ఇది అని ఆయన చెప్పారు. రేపు అనేది ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

పారదర్శక పాలనను అమలు చేస్తున్నామన్నారు.వ్యవసాయరంగంపై ఇప్పటివరకు రూ. 83 వేల కోట్లను వ్యయం చేసినట్టుగా ఆయన చెప్పారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామన్నారు..31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకాన్ని అమలు చేశామన్నారు.రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధాన్యం సేకరణ కోసం రూ. 33 వేల కోట్లను ఖర్చు చేసినట్టుగా సీఎం చెప్పారు.

ప్రతి నెలా ఒకటో తేదీనే గడప వద్దకే ఫించన్ అందిస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలను అందించామన్నారు. గ్రామ సచివాలయాలు నూతన విప్లవానికి నాందిగా నిలుస్తాయన్నారు.

అమూల్ పాల వెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచినట్టుగా ఆయన చెప్పారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద రూ. 26,677 కోట్లను ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలను మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చామన్నారు.ఈ పథకం కింద వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

తమది మహిళల పక్షపాత ప్రభుత్వమని ఆయన చెప్పారు. తన కేబినెట్ లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన చెప్పారు. అక్కా చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.