ఏమి సెపితిరి.. బాబు గారు
- నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య
- గతంలో నోట్ల రద్దు క్రెడిట్ తనదేనని చెప్పుకున్న ఏపీ సీఎం
ఇన్నాళ్లు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మాత్రమే జనాలకు తెలుసు.. నోట్ల రద్దుతో ఆయన రెండు నాలుకల సిద్ధాంతం కూడా ఇప్పుడు ప్రజలకు తెలిసొచ్చింది.
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంటే.. ఆ క్రెడిట్ నాదేనని, నా లేఖ వల్లే మోదీ నోట్లను రద్దు చేశారని చంద్రబాబు ఊదరగొట్టారు.
ఇక తెలుగు దేశం శ్రేణుల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆ క్రెడిట్ ను బాబుగారికి ఆపాదించేందుకు చేయాల్సిన భజన అంతా చేసింది.
తీరా ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో తన క్రెడిట్ ను తానే వెనక్కి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తన రెండు నాలుకల సిద్ధాంతాన్ని బయట పెట్టారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అంతేనా తన రాజకీయ జీవితంలో ఒక సమస్యను ఇంత కాలమైన పరష్కరించకుండా ఉండడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.
హుద్ హుద్ తుఫానుతో విశాఖపట్నం అతలాకుతలం అయితే కేవలం 8 రోజుల్లోనే పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చానని గుర్తు చేసుకున్నారు.
ఇదంతా బాగానే ఉందికాని బాబు గారు సడన్ గా ఇలా మాట మార్చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో ఆయన భజన బృందానికి అర్థం కావడం లేదట.