కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చారు: చంద్రబాబు
కాపు రిజర్వేషన్లపై వైసీపీ మాట మార్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కాపులకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించినట్టు ఆయన చెప్పారు.
విశాఖపట్టణం: కాపు రిజర్వేషన్లపై వైసీపీ మాట మార్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కాపులకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించినట్టు ఆయన చెప్పారు.
విశాఖపట్టణం జిల్లాలోని గుడివాడలో మంగళవారం నాడు నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
కాపులకు రిజర్వేష్ల విషయమై తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబునాయుడు చెప్పారు.
కాపుల రిజర్వేషన్లపై వైసీపీ మాట మార్చిందన్నారు. వైసీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాలుగేళ్ల క్రితం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలు పడి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. హోంగార్డులు, ఆశావర్కర్లకు వేతనాలను పెంచిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.
కేసుల మాఫీ కోసం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కేంద్రంతో రాజీ పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్ర పెద్దలు పూటకో మాట మాట్లాడారని ఆయన విమర్శలు చేశారు. ఏపీకి కేంద్రం అన్ని రకాల అన్యాయం చేసిందన్నారు. అందుకే ఏన్డీఏ నుండి తాము బయటకు వచ్చినట్టు చెరప్పారు. కాపు రిజర్వేషన్ పై వైసీపీకి చిత్తశుద్ది లేదన్నారు.
జగన్ వారానికి రెండు రోజులు పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని బాబు చెప్పారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తోంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి వెన్ను చూపారన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు గోదావరి నీళ్లు ఇస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని ఆయన చెప్పారు.