చంద్రన్నకు లక్షకోట్లకు పైగా బాకీలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతికుటుంబానికి రు. 66 వేలు బాకీ ఉన్నాడు... ఎలాగో తెలుసా?
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లక్షలాది కుటుంబాలకు బాకీ ఉన్నాడు. గత రెండున్నరేళ్లలో ఆయన రుణభారం పెరిగింది.ఎలా తీరుస్తాడో ఏమో.
నూరో ఇన్నూర్ కాదు,ఏకంగా కుటుంబానికి 66 వేల రుపాయలు బాకీ పడ్డాడు.
ఈ బాకీ వసూలు చేసుకునే బాధ్యత ఆ కుటుంబాలదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజ్ఞప్తి చేసి వసూలు చేసుకుంటారో, దబాయించి లాక్కుంటారో...
బాకీ ఎగ్గొట్టిన వాడినుంచి ఎలా వసూలు చేసుకుంటారో అలా వసూలు చేసుకోవాలంటున్నారుప్రతిపక్ష నాయకులు.
ఇంతకీ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ఉన్న లక్షకోట్ల పైబడి ఎలా బాకీ పడ్డాడో తెలుసా...
అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, అలాకానిపక్షంలో ఉద్యోగం అందించే వరకు రు. 2000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలుగు దేశం అధ్యక్షుడు గా చంద్రబాబు గత ఎన్నికలపుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు జూన్ 2014 లో అధికారంలోకి వచ్చారు. 2017 ఫిబ్రవరికి అధికారం చేపట్టి 33 నెలలయింది.
ఈ లెక్కన ఉద్యోగాలుదొరకని యువతీయువకులున్న ప్రతికుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 66 వేలు చెల్లించాలి. ఇది బాకీ కాదా, అని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.
ప్రజలకున్న ఈ బాకీ తీర్చడం మీ బాధ్యత అని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక బహిరంగ లేఖ రాశారు.
జగన్ లెక్క ప్రకారం, రాష్ట్రంలో ఉన్న 1 కోటీ 75 లక్షల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 66 వేల చొప్పున ఒక లక్షా 15 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు.
ఈ బకాయిలతో పాటు, ముందుముందు భృతి మొత్తాన్ని చెల్లించేందుకు 2017-18 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుంటే ఈ కుటుంబాలసమీకరించి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.