ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ: 14 పార్టీల నేతలతో సమావేశం
జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర కూటమికి హస్తిన కేంద్రంగా ఇప్పటికే పలు పార్టీల నేతలతో పలు దఫాలుగా చర్చించారు చంద్రబాబు. అయితే మరోసారి సోమవారం ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు.
ఢిల్లీ: జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర కూటమికి హస్తిన కేంద్రంగా ఇప్పటికే పలు పార్టీల నేతలతో పలు దఫాలుగా చర్చించారు చంద్రబాబు. అయితే మరోసారి సోమవారం ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పార్లమెంట్ అనెక్స్ హాలులో బీజేపీయేతర కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుతోపాటు 14 పార్టీల నేతలు సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ్బంగ సీఎం మమతా బెనర్జీ, లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్యాదవ్, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, కనిమెుళి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, తేజస్వీయాదవ్ లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో సేవ్ ది నేషన్, సేవ్ ది డెమెక్రసీ బుక్ లెట్ ను చంద్రబాబు నాయుడు అందరికీ అందజేశారు. కొత్తకూటమి ఏర్పాటు, ప్రతిపాదనపై 14 మంది పార్టీ ల నేతలు చర్చిస్తున్నారు. అలాగే మంగళవారం నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కార్ ను ఎలా ఇరుకున పెట్టాలి అనే అంశాలపై చర్చించారు. అలాగే బీజేపీయేతర పక్షాల కామన్ మినిమమ్ ప్రోగ్రామ్పై చర్చించారు.
ఇకపోతే ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు తొలుత పశ్చిమ బంగా సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిశారు. ఆమెతో అరగంట పాటు దేశ రాజకీయాలపై చర్చించారు. కూటమి ఏర్పాటు ఆవశ్యకతపై చర్చించారు.
ఆ తర్వాత ఏపీ భవన్లో చంద్రబాబుతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ఎంపీ కనిమొళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇకపోతే బీజేపీ యేతర కూటమి సమావేశానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి కానీ ఆమె పార్టీ తరపున ప్రతినిధులు కానీ హాజరుకాలేదు. అలాగే సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేష్ యాదవ్ కానీ పార్టీ ప్రతినిధులు కానీ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.