మహాకుట్రలో భాగమే పవన్ విమర్శలు, ఆపరేషన్ గరుడ నిజమే : చంద్రబాబు
జగన్ బిజెపికి అద్దె మైకుగా, వైసీపి సొంత మైకుగా మారాడన్న చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా కుట్ర జరుగుతోందని ఏపి సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ బెంజి సర్కిల్ లో జరుగుతున్న నవ నిర్మాణ దీక్షలో ప్రసంగించిన ఆయన....కేంద్ర ప్రభుత్వం వైసిపి నాయకుడు జగన్ ను, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను ఉపయోగించి ఈ మహాకుట్ర చేస్తున్నారని తెలిపారు. వీరందరు కలిసి రాష్ట్రాన్ని అస్థిరపర్చి తమను దెబ్బతీయాలని అకుంటున్నారని, కానీ ఈ ప్రయత్నంలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నామని గుర్తించలేక పోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల జోలికి వస్తే ఏరుకునేది లేదని హెచ్చరించారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించే సమయంలో కొంతమంది రాజీపడ్డారని, మరికొంతమంది కోవర్టులుగా మారారని చంద్రబాబు ఆరోపించారు. ఆ రాజీపడిన,కోవర్టులే ఇపుడు మళ్లీ మరిన్ని కుట్రలకు తెరలేపుతున్నారని అభిప్రాయపడ్డారు. హీరో శివాజీ చెప్పినట్లు రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ ప్రారంభమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఏపీని విచ్చిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వ కుట్ర పన్నుతోందని చంద్రబాబు అరోపించారు. అందుకోసమే జగన్ ద్వారా రాయలసీమ డిక్లరేషన్, పవన్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం చేస్తున్నారని అన్నారు. వీరి మాటలు వింటే ప్రజలు మరోసారి మోసపోవాల్సి వస్తుందని, ఇప్పటివరకు మోసపోయింది చాలని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడని పవన్, జగన్ లు ఇపుడు ఆపరేషన్ మహాకుట్రలె భాగంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
జగన్ బిజెపికి అద్దె మైకుగా, వైసీపి సొంత మైకుగా మారి మాట్లాడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు. అసలు జగన్ కు రాష్ట్ర అభివృద్దిపై చిత్తశుద్దే లేదని,ఎప్పుడూ తన రాజకీయ లబ్ధి కోసమే పాకులాడుతుంటాడని అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను కానీ, హామీలు నెరవేర్చని బిజెపి ని కానీ జగన్ ఎనాడైనా విమర్శించాడా అని ప్రశ్నించారు. ఆయన బిజెపితో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే తమపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించాడు.