చంద్రబాబుకు ఐటీ నోటీసులు కేసులో కీలక పరిణామం : రంగంలోకి ఏపీ సీఐడీ.. రెండు స్కాంలు, డబ్బులు ఒక్కరికేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలలో డబ్బులు చేరింది ఒక వ్యక్తి దగ్గరకేనని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలలో మూలాలు ఒకటే చోట వున్నాయని సీఐడీ అనుమానిస్తోంది. ఈ రెండు కుంభకోణాల్లో ఒకే వ్యక్తులు వుండటంతో విచారణ జరపాలని నిర్ణయించింది. ఐటీ స్కాంలో కీలకపాత్ర పోషించిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూత్రధారిగా భావిస్తున్న యోగేశ్ గుప్తాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిని త్వరలోనే అధికారులు విచారించనున్నారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఈ వ్యవహారంపై నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది. స్కిల్ స్కాంలో భారీగా అవినీతికి , అవకతవకలకు పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది. రెండు కుంభకోణాల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ పాత్రపై అభియోగాలు నమోదు చేసింది. రెండు స్కాంలలో డబ్బులు చేరింది ఒక వ్యక్తి దగ్గరకేనని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. యూఏఈలోని దుబాయ్ నుంచి కూడా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపైనా ఫోకస్ పెట్టింది.
ALso Read: చంద్రబాబుకు షాక్: ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీస్
కాగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను శాఖ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 4న ఆదాయపన్ను శాఖ ఈ నోటీసును జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్లు చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఐటీ శాఖకు చంద్రబాబు నాయుడు పంపిన వివరణను ఐటీ శాఖ తిరస్కరించిందని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది.