Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారు.. అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు రాజేష్ అరెస్ట్‌పై వివరణ ఇచ్చిన ఏపీ సీఐడీ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్‌, రాజేష్‌లపై ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయని ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ వెల్లడించారు. చట్టప్రకారమే అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు.

AP CID explain on TDP Leader Ayyanna patrudu and his on arrest
Author
First Published Nov 3, 2022, 1:38 PM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్‌, రాజేష్‌లపై ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయని ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ వెల్లడించారు. వారిపై 2 సెంట్ల భూమిని ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆ భూమిపై ఫేక్ ఎన్‌వోసీని తీసుకొచ్చారని అన్నారు. ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు వచ్చినట్టుగా చెప్పారు. ఏ-1 అయ్యన్నపాత్రుడు, ఏ2- విజయ్, ఏ-3గా రాజేష్‌పై కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. సాధారణంగా రాజకీయ నాయకులపై ఆరోపణలు వస్తాయని.. అయితే తాము తొందరపడకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ నిర్వహించామని చెప్పారు. ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి విచారణ చేపట్టిన తర్వాత ఆరోపణలు అన్నీ నిజమని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. 

అయ్యన్నపాత్రుడు, విజయ్, రాజేష్‌లపై ఐపీసీ సెక్షన్ 464, 467, 471, 474, రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. ఈ కేసులో చట్టప్రకారమే అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వారి నుంచి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ రోజు వారిని కోర్టులో హాజరుపరచనున్నట్టుగా చెప్పారు.

ఇదిలా ఉంటే.. అయ్యనపాత్రుడును, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం  తెల్లవారుజామున ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో అయ్యనపాత్రుడు హైకోర్టుకు నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అయ్యనపాత్రుడితో సహాయ ఆయన ఇద్దరు కుమారులు విజయ్‌, రాజేష్‌లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి చేరకున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక, అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది.

పోలీసులు తీరుపై అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అయ్యన్న పాత్రుడు, రాజేష్‌లను ప్రభుత్వం అరెస్టు చేసిందని అయ్యన్న భార్య పద్మావతి విమర్శించారు. తన  భర్త, కుమారుడికి ప్రాణాహాని ఉందని ఆరోపించారు. వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక, అయ్యన్న అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నర్సీపట్నం బంద్‌కు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు.. అయ్యనపాత్రుడు అరెస్ట్‌ను ఖండించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios