మహాసంప్రోక్షణ వివాదం: రంగంలోకి బాబు
: మహాసంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహాసంప్రోక్షణ సందర్భంగా గతంలో పాటించిన నియమాలను అమలు చేయాలని ఆయన టీటీడీని ఆదేశించారు.
తిరుమల: మహాసంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహాసంప్రోక్షణ సందర్భంగా గతంలో పాటించిన నియమాలను అమలు చేయాలని ఆయన టీటీడీని ఆదేశించారు.
మహాసంప్రోక్షణను పురస్కరించుకొని వారం రోజులకు పైగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ భావిస్తున్నట్టు వార్తలు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది.వచ్చే నెల 11 నుండి 16వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కారణంగా ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ భావిస్తున్నట్టు ప్రచారం సాగింది. అయితే దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.
ఈ విమర్శల నేపథ్యంలో చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. టీటీడీ చైర్మెన్గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకమైన నాటి నుండి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటున్నారని వైసీపీ విమర్శలు చేసింది. దీంతో చంద్రబాబునాయుడు మంగళవారం నాడు టీటీడికి ఆదేశాలు జారీ చేశారు.
మహాసంప్రోక్షణ పేరుతో ఆలయాన్ని మూసివేసే చర్యలను మానుకోవాలని చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మహాసంప్రోక్షణ పేరుతో గతంలో పాటించిన నియమాలను పాటించాలని ఆయన ఆదేశించారు. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనం కోసం అనుమతించాలని ఆయన సూచించారు.
ఆగమశాస్త్ర నియమాలను అనుసరించాలని ఆయన టీటీడీని కోరారు. ఈ నియమాలకు వ్యతిరేకంగా చేయకూడదని బాబు ఆదేశించారు. 1996, 2004 లలో రెండు దఫాలు మహాసంప్రోక్షణ నిర్వహించారు.ఈ రెండు సమయాల్లో అనుసరించిన నిబంధనలను పాటించాలని చంద్రబాబునాయడుు సూచించారు.
మహాసంప్రోక్షణ పేరుతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆలయ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని ఆయన సూచించారు.