నీతి ఆయోగ్ మీటింగ్: కేంద్రాన్ని నిలదీసే ప్లాన్లో బాబు
బాబు ప్లాన్ ఇదే
అమరావతి: కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రానికి సహకరించాల్సింది పోయి కేంద్రం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై నీతి ఆయోగ్ సమావేశంలో పట్టుబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై గురువారం నాడు ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమావేశమై చర్చించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం నుండి వచ్చిన నిధులతో పాటు విభజన హమీలు, ఇతర అంశాలను ప్రస్తావించనున్నారు.
కేంద్ర సహకారం లేకున్నా 10.5% వృద్ధిరేటు సాధించామన్నారు. అనేక కష్టాలు, అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతున్నా మూడేళ్ల నుంచి కష్టపడి పనిచేసి రెండంకెల వృద్ధిరేటు సాధించామని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నామని, పోలవరంలో డయాఫ్రం వాల్ విజయవంతంగా పూర్తి చేశామని బాబు తెలిపారు. పోలవరం విషయంలో మన వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నిధుల విడుదలలో ఆలస్యం సరికాదన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.