కేబినెట్ సమావేశం వాయిదా... అధికారిక ఉత్తర్వులు జారీ
నవంబర్ 4వ తేదీన జరపాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని జగన్ సర్కార్ వాయిదా వేసింది.
అమరావతి: నవంబర్ 4వ తేదీన జరపాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని జగన్ సర్కార్ వాయిదా వేసింది. నవంబర్ 5వ తేదీన మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 15వ తేదీ తర్వాత నిర్వహించాలని వైసిపి ప్రభుత్వం భావిస్తోంది. వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాదు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను పంపాలని ఆయా శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
నవంబర్ 2వ తేదీ లోపుగా ఆయా శాఖలు పంపాలని సీఎస్ సూచించారు. నవంబర్ లో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఏడాది జూన్ 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. జూన్ 18వ తేదీన బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. నవంబర్ మాసంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.