మీవి, మంత్రులవేనా ప్రాణాలు? లక్షలాది విద్యార్థులవి కావా?: జగన్ పై లోకేష్ ఆగ్రహం
ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని... వారిని కాపాడుకోడానికి పోరాటం చేయడానికి కూడా సిద్దమని ఇప్పటికే టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
గుంటూరు: కరోనా మహమ్మారి రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో పది, ఇంటర్ పరిక్షలను వాయిదా వేయాలని టిడిపి కోరుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపిస్తోంది. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రాణాలకు పరీక్షల వల్ల ప్రమాదం పొంచివుందని... వారిని కాపాడుకోడానికి పోరాటం చేయడానికి సిద్దమని ఇప్పటికే టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తాజాగా మరోసారి వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్.
''కోవిడ్ సెకండ్వేవ్ తీవ్రత దృష్ట్యా సెక్రటేరియట్లో ఇవాళ జరగాల్సిన కేబినెట్ మీటింగ్ని వాయిదా వేయించిన ముఖ్యమంత్రి గారూ! మీవి, మంత్రులవేనా ప్రాణాలు? లక్షల మంది విద్యార్థులవి ప్రాణాలు కావా? ఇంటి నుంచి సెక్రటేరియట్కి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఆరోగ్యరక్షణ ఏర్పాట్ల మధ్య వెళ్లి 30 మంది మంత్రులతో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వల్లే కరోనా సోకుతుందని మీరు భయపడిన వాయిదా వేయించారు. 15 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్షల నిర్వాహకులు, ఇతరత్రా అంతా కలిసి 80 లక్షలమందికి పైగా పరీక్షల కోసం రోజూ రోడ్లమీదకు రావాల్సి వుంటుంది. మరి వారికి కరోనా సోకదా? పరీక్షలు ఎందుకు వాయిదా వేయరు?'' అని లోకేష్ నిలదీశారు.
read more ఇటు రావద్దమ్మా అంటూ కరోనాకు విద్యామంత్రి లేఖ...: సోమిరెడ్డి ఎద్దేవా
ఇక ''ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్నారు. బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరత. మీ పాలనలో కనీసం పార్థివదేహాన్ని తీసుకెళ్లే దిక్కుకూడా లేదు. రోడ్ల పై ప్రజల ప్రాణాలు పోతుంటే ప్యాలెస్ లో మీకు నిద్ర ఎలా పడుతుంది వైఎస్ జగన్ గారు?'' అంటూ ట్విట్టర్ వేదికన స్పందించారు.
''శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన ఘటన గురించి వినగానే కన్నీరు ఆగలేదు. ఆ కుటుంబం ఉన్న చోట మనం ఉంటే ఏంటి అని ఒక్క సారి ఆలోచించండి జగన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అనుమతిలో ప్రభుత్వ జాప్యం, డబ్బు కోసం ప్రైవేట్ ఆసుపత్రి ఒత్తిడి కలిసి ఒక ప్రాణాన్ని నడి రోడ్డు మీద బలిగొన్నాయి. అంజలి గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలి'' అని లోకేష్ సూచించారు.