ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది బీజేపీ. గురువారం పార్టీ రాష్ట్ర నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. 

ఏపీ బీజేపీ (bjp) ముఖ్య నేతల సమావేశం జరిగింది. తెలంగాణ తరహాలో ఏపీలోనూ ప్రభుత్వ విధానాలపై యుద్ధం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రం నిధులతో నడుపుతున్న పథకాలకు.. రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఏపీలో కేంద్ర మంత్రుల పర్యటనలకు సైతం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 

అంతకుముందు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భక్తి కలిగిన భారతీయుడు అంబేద్కర్ అని… ప్రతి అంశంపైనా ఆయనకు చాలా స్పష్టత ఉందని ప్రశంసించారు. దేశ విభజన అంబేద్కర్‌కి అసలు ఇష్టం లేదని.. ఆనాడు‌ చెరువుల్లో కూడా దిగనీయని పరిస్థితి ఉందని సోము వీర్రాజు గుర్తుచేశారు. అగ్ర వర్ణాలతో కలిసి నడవకూడని దుస్థితి అని.. ఇవన్నీ అంబేద్కర్ ప్రత్యక్షంగా చూడటం ద్వారా ఆలోచన కలిగిందని తెలిపారు. అందుకే అన్ని అంశాలను సునిశితంగా ఆలోచించే వారని.. సంస్కృతం దేశ భాషగా ఉండాలని అంబేద్కర్ చెప్పారని సోము వీర్రాజు వెల్లడించారు.

ఆ వర్గం కోసం‌ పోరాడుతూ, రిజర్వేషన్ కల్పించారని.. రాజ్యాంగం రచించి.. అన్ని వర్గాల వారికి స్వేచ్చను కలిగించారని తెలిపారు. భారతదేశంలో ఉన్న మూలాలపై సమగ్రంగా అధ్యయనం చేశారని.. ఎన్ని కష్టాలొచ్చినా లక్ష్యాల నుంచి పక్కకు జరగలేదని సోము వీర్రాజు కొనియాడారు. అంబేద్కర్ జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని.. అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకుంటూ బీజేపీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆలోచనా‌ విధానాలనే మోడీ అమలు చేస్తున్నారని.. సమ్మిళత అభివృద్ధిలో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన రూ. 18.60 కోట్ల మందికి లబ్ది జరగుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు