వైసీపీ నేత, మంత్రి దాడిశెట్టి రాజా అనుచరుల భూ కబ్జాలపై మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
వైసీపీ (ysrcp) నేతల భూకబ్జాలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu veerraju). మంత్రి దాడిశెట్టి రాజా (dadisetti raja) అనుచరులే దందా చేస్తున్నారని మీడియా కోడై కూస్తోందని ఆరోపించారు. స్వయానా బాధిత కుటుంబం రోడ్డునపడి కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతోందా? నీ సొంత పార్టీ నేతలు అయినంత మాత్రాన చర్యలు ఉండవా? అంటూ సోము వీర్రాజు సీఎం జగన్ పై (ys jagan) సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
ఈ వ్యవహారంలో తక్షణమే సీఎం జగన్ స్పందించి ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 'అధికార దర్పాన్ని ప్రదర్శించి అమాయక రైతుల భూముల కబ్జా చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదు జగన్ గారూ' అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
కాగా.. మంత్రి దాడిశెట్టి రాజా ప్రోత్సాహంతో ఆయన అనుచరులు తమ భూమిని ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు కుటుంబం కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగడం కలకలం రేపింది. ఈ రైతు కుటుంబం తమ పశువును కూడా కలెక్టర్ కార్యాలయం ఎదుట కట్టేసి నిరసనకు దిగడం గమనార్హం. అంతేకాదు, ఆ రైతు కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
