ఎపి లొ కొంతమంది కి అధికారమే కావాలని, అభివృద్ధి అక్కర్లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. నేనున్నానంటూ అందరికీ చెప్పి జగన్ ఓట్లు వేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఎపి లో రెండో కోటా రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని.. పేదల పక్షాన బిజెపి ఉద్యమం చేస్తుందన్నారు.
ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ జగన్ (ys jagan ) అంతా నష్టపోయారని అన్నారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu veerraju) . మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆగస్టు 2 నుంచి 15 వరకు జరగనున్న యువ సంఘర్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్ , లోగోలను వీర్రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. టీచర్స్, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాంనని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పారంటూ వీర్రాజు మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి నేనున్నా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు.
యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపట్టారని.. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని సోము వీర్రాజు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది నిరసన కార్యక్రమం కాదని.. అనుమతి ఇస్తారనే మేము భావిస్తున్నామన్నారు. ప్రధాని పర్యటన లో నల్ల బెలూన్లు ఎగురవేయడం సరైన విధానం కాదని వీర్రాజు హితవు పలికారు. మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని.. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీల గురించి మాత్రమే మోడీ మాట్లాడారని.. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరి కాదని సోము వీర్రాజు హితవు పలికారు.
Also Read:ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: మోడీకి జగన్ వినతి
కొంతమంది షడన్ గా పుట్టుకొచ్చి మేధావులుగా మాట్లాడతారని.. అటువంటి వారి మాటలను మేము పట్టించుకోమని చురకలు వేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది మోడీ మంత్రమని.. ఎపి లొ కొంతమంది కి అధికారమే కావాలని, అభివృద్ధి అక్కర్లేదంటూ సోము పేర్కొన్నారు. బిజెపి కి అభివృద్ధి కావాలి.. ప్రత్యామ్నాయ శక్తి గా ఎపిలో ఎదుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎపి లో రెండో కోటా రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని.. పేదల పక్షాన బిజెపి ఉద్యమం చేస్తుందన్నారు. విద్య, వైద్యానికి బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు.
రాష్ట్రం లో జాతీయ రహదారులు బాగున్నా.. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర రహదారులు నిర్వహణ బాధ్యత యువకులకు అప్పగిస్తామని, మొక్కలు పెంచి..వాటిని సంరక్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తామని సోము వీర్రాజు తెలిపారు. తెలంగాణ, ఎపి లలో బిజెపి అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తామని.. జాతీయ సమావేశాలలో కూడా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించామని ఆయన పేర్కొన్నారు.
బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ మాట్లాడుతూ... ఈరోజు బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని.. మూడేళ్లల్లో వాటిని అమలు చేయకుండా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో యాత్ర చేపడుతున్నామని.. నాలుగు జోన్ లలో ఒకే సారి ఈ యాత్ర జరుగుతుందని మోహన్ తెలిపారు. మోడీ సాయాలు, జగన్ మోసాలు పై ప్రజలకు వివరిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం పై సంఘర్షణకు సిద్దం అవుతున్నామన్నారు.
ఉద్యోగాలు లేవు, కోట్ల మంది ఆశలు అడియాసలు చేశారని... రాష్ట్రం లో యువత మత్తుకుబానిస అవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని కేతినేని దుయ్యబట్టారు. ఆగష్టు2న తిరుపతి నుంచి ప్రారంభమై రాయలసీమ లో ఒక యాత్ర.. తిరుపతి నుంచి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు , విజయవాడ వైపు మరో ర్యాలీ.. మచిలీపట్నం నుంచి ప్రారంభమై ఉభయగోదావరి జిల్లాల మీదుగా రాజమండ్రి వరకు ఒకటి.. ఉత్తరాంధ్ర లో మరో ర్యాలీ చేపడతామని మోహన్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని... ఆగష్టు 15 వరకు ఈ ర్యాలీలు జరుగుతాయని ఆయన చెప్పారు.
కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలని మోహన్ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి.. అభివృద్ధి చేసే బిజెపి ని ఆదరించాలని కోరారు. రాయలసీమలో 1900, కోస్తాంధ్ర లో 1700, గోదావరి జిల్లాల్లో1400, ఉత్తరాంధ్రలో 1400 కిమీ చొప్పున సుమారు 7,500కి.మీ ఈ యాత్ర సాగుతుందని కేతినేని స్పష్టం చేశారు. విజయవాడ లోనే ఆగష్టు లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
