ఐదు రోజులు, 19బిల్లులు, 21 ఎజెండా అంశాలు... బిఎసిలో ప్రభుత్వ నిర్ణయం
5 రోజుల పాటు అంటే డిసెంబర్ 4వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు.
అమరావతి: సోమవారం శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్బంగా సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు ఇలా వివిధ అంశాలపై చర్చించేందుకు బిఎసి సమావేశం జరిగింది. 5 రోజుల పాటు అంటే డిసెంబర్ 4వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 21 ఎజెండా అంశాలను అధికార వైసిపి ప్రతిపాదించింది.
read more ఏపీ అసెంబ్లీ: తడిసిన వరి కంకులతో కాలినడకన చంద్రబాబు
అయితే ఈ సమావేశంలో ప్రతిపక్ష టిడిపి తరపున పాల్గొన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు 20అంశాలపై చర్చ జరపాలని పట్టుబట్టాడు. కనీసం 10రోజుల పాటైనా సభ జరపాలని తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్న దృష్ట్యా వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, పరిష్కరించేలా చేసేందుకు 5రోజుల వ్యవధి ఎందుకూ సరిపోదన్నారు. టిడిపి లేవనెత్తిన 20అంశాలపై చర్చ జరగాల్సిందేనని అచ్చెన్నాయుడు పట్టుబట్టారు.
అసెంబ్లీలో చర్చకు టిడిపి పట్టుబడుతున్న 20 అంశాలివే:
1. భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం – నెల్లూరులో ధాన్యం కొనుగోళ్లు
2. ఎన్ ఆర్ఈజీఎస్ బకాయిలు నిలిపివేత
3. టిడ్కో ఇళ్ల పంపిణీ – ఇళ్ల పట్టాల భూసేకరణలో అవినీతి
4. దళితులు, మైనారిటీలపై దాడులు
5. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగింపు
6. నూతన ఇసుక పాలసీ – దోపిడీ
7. నిత్యావసర ధరల పెరుగుదల – ప్రజలపై భారాలు
8. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం
9. పెరుగుతున్న నిరుద్యోగం – మూతపడుతున్న పరిశ్రమలు
10. పీపీఏల రద్దు – జీవో నెం.25
11. ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు – ప్రభుత్వ నిర్లక్ష్యం
12. మద్యం అమ్మకాలు – నాశిరకం బ్రాండ్లు
13. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల దుస్థితి– రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, జీవో 21 రద్దు
14. సంక్షేమ పధకాలు రద్దు - సబ్ ప్లాన్ల నిర్వీర్యం
15. పెన్షన్ రెండో విడత పెంపు వైఫల్యం
16. కరోనా – సహాయ చర్యల్లో వైఫల్యం
17. పన్నులు పెంపు – ఆస్థి పన్ను
18. స్థానిక సంస్థల ఎన్నికలు
19. దేవాలయాలపై దాడులు
20. మితిమీరిన అప్పులు – దుబారా
తదితర అంశాలు అన్నింటిపై చర్చ జరిగేలా సభా సమావేశాలను కనీసం 10రోజుల పాటైనా నిర్వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మొక్కుబడిగా సమావేశాలను నిర్వహించాలని చూస్తున్నారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.