అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమైన ఏపీ ప్రభుత్వం.. ఈ నెల మూడో వారంలో ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది . ఈ నెల మూడో వారంలో ఏపీ సమావేశాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది . ఈ నెల మూడో వారంలో ఏపీ సమావేశాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరగనుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులతో పాటుగా, మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
ఇక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ఈ నెల 29న కేబినెట్ భేటీ జరగనున్నట్టుగా ప్రభుత్వం తొలుత వెల్లడించింది. అయితే దానిని వాయిదా వేసినట్టుగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సెప్టెంబర్ 1న కేబినెట్ భేటీ జరగనున్నట్టుగా తెలిపింది. అయితే తాజాగా కేబినెట్ మరోసారి వాయిదా పడింది. సీఎం జగన్ కడప పర్యటన నేపథ్యంలో.. కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్టుగా తెలిపింది.