పదవిలో వున్నా లేకున్నా నిమ్మగడ్డ విచారణకు రావాల్సిందే: ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసును ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరించింది. అలాగే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు నోటీసు ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసును ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరించింది. అలాగే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు నోటీసు ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది.
కమిటీకి అందుబాటులో ఉండాలని ఎస్ఈసీకి ఇచ్చే నోటీసులో పేర్కొనాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రేపు అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ఎస్ఈసీకి నోటీసులు పంపనుంది ప్రివిలేజ్ కమిటీ. సమావేశం అనంతరం ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరి 6న హౌస్ అరెస్ట్ ఆర్డర్ పాస్ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారని కాకాణి తెలిపారు. ఫిబ్రవరి 7న పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారని వెల్లడించారు.
ఎస్ఈసీకి నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. పదవిలో వున్నా లేకున్నా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన ఆరోపణలపై విచారణకు హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు తప్పు చేశారని సీఐడీ ప్రాథమిక విచారణలో తేలిందని.. ఆయన చట్టానికి, రాజ్యాంగానికి అతీతుడు కాదని కాకాణీ అన్నారు. చంద్రబాబు నాయుడు నీతిమంతుడైతే విచారణలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కాకాణీ సవాల్ విసిరారు.