ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం : రూపురేఖలు ఇవీ....
అంతర్వేదిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి రథం నిర్మాణం ఫిబ్రవరిలోగా పూర్తవుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. రథం రూపురేఖలను కూడా వెల్లంపల్లి వివరిచారు.
విజయవాడ: వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయని, అప్పటిలోగా అందరి అభిప్రాయంల మేరకు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. సొమవారం బ్రాహ్మణ వీధిలో దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావుతో మంత్రి వెలంపల్లి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్నారు.కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారన్నారు.
ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారని, కొత్త రథం నిర్మాణంతో పాటు....రథశాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఎస్ఈ శ్రీనివాసరావు ఉన్నారు.
అంతర్వేదిలోని రథాన్ని దుండగులు కాల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బిజెపి, టీడీపీ, జనసేన ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో సంఘటనపై ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.