Asianet News TeluguAsianet News Telugu

Psycho Killer : అపార్ట్మెంట్ల వాచ్మెన్ లే టార్గెట్.. పెందుర్తిలో మరో మహిళ హత్య, పట్టుబడ్డ అనుమానితుడు...

పెందుర్తిలో అపార్ట్మెంట్ వాచ్ మెన్ లే లక్ష్యంగా సైకో కిల్లర్ వీరంగం సృష్టిస్తున్నాడు. మూడు వారాలుగా ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత జరుగుతున్న హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. కాగా నిందితుడు పట్టుబడినట్టు సమాచారం. 

another woman murdered at pendurthi, Psycho killer in police custody
Author
Hyderabad, First Published Aug 16, 2022, 8:05 AM IST

పెందుర్తి : సోమవారం వచ్చింది అంటేనే విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిసరప్రాంత వాసులు వణికిపోతున్నారు. శివారు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లలో నివసించే వాచ్మెన్ కుటుంబాలే లక్ష్యంగా ఇక్కడ వరుస హత్యలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నీ సోమవారంనాడే జరుగుతున్నాయి. దీంతో ఇది సైకో కిల్లర్ పనేనని పోలీసులు కూడా భావిస్తున్నారు. గత సోమవారం చిన్నముసిడివాడలో నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లో వృద్ధ దంపతులు అప్పారావు లక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు. అదే రీతిలో సుజాతనగర్ నాగమల్లి లేఅవుట్ లో ఈ సోమవారం అంటే ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత.. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లో వాచ్మెన్ భార్య లక్ష్మీ హత్యకు గురయింది. 

హత్య జరిగిన ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తి పట్టుబడడం అతని వద్ద ఇనుపరాడ్ లభించడంతో అతనే సైకో కిల్లర్ అని స్థానికులు అనుమానిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి సమయంలో ఈ హత్యలకు పాల్పడుతున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెల్లార్ లో ఎటువంటి భద్రతలేని వాచ్మెన్ కుటుంబాలను టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ అనుమానితుడిని నర్సీపట్నం సమీప బొడ్డేపల్లి శివారు వీరవాసరం గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. అతను కొంతకాలం కుటుంబంతో సహా హైదరాబాదులో ఉండేవాడిని, అతడి ప్రవర్తన నచ్చక భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిసింది. 

పోలీసులకు సవాల్ గా మారిన దంపతుల హత్య కేసు...

దీంతో ఉన్మాదిగా మారి, పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పెందుర్తి వచ్చాడని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తూ వెల్దుర్తి ప్రశాంతినగర్ లో నివసించే వాడని,  కొద్ది రోజులుగా అక్కడ కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. గతనెలలో పెందుర్తి అఖిలేశ్వరి ఆస్పత్రి వద్ద నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లో వాచ్మెన్ భార్య, కుమారుడు నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ముఖంపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు అని పోలీసులకు ఫిర్యాదు అందింది. 

ఇదే తరహాలో ఓ వారం రోజుల క్రితం చిన్నముసిడివాడలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో  సుజాతనగర్ లో వాచ్మెన్ భార్య హత్యకు గురయింది. ఈ మూడు ఘటనలో ఒకే తీరుగా ఉండడం అన్నీ సోమవారం రోజునే జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆ హత్యలు తానే చేశానని పోలీసుల విచారణలో అనుమానితుడు అంగీకరించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 10న విశాఖపట్నం జిల్లా పెందుర్తి జీవీఎంసీలో 97వ వార్డు చిన్నముసిడివాడ సప్తగిరినగర్ లో జరిగిన దంపతుల హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. పలువురు అనుమానితులను విచారించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఎనిమిదో తేదీ హత్య జరగగా.. తొమ్మిదో తేదీ ఉదయం వెస్ట్జోన్ ఏసీపీ అశోక్ కుమార్, సిబ్బంది సంఘటన ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు. దగ్గరలోని రోడ్లు, ఇల్లు, దుకాణాలు వంటి ప్రదేశాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా  పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఆధారాలు లభిస్తే అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios