ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కనగానపల్లి మండలం కొండపల్లిలో యువతి హత్యకు గురైంది. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెను దుండగులు హత్య చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కనగానపల్లి మండలం కొండపల్లిలో యువతి హత్యకు గురైంది. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెను దుండగులు హత్య చేశారు. వివరాలు.. మమత అనే యువతి ఈ రోజు ఉదయం బహిర్భూమికి వెళ్లింది. మమత ఎంతసేపటికి తిరిగి రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మమతను మృతదేహం కనిపించింది. ఆమెను గుర్తుతెలియని దుండగులు తలపై బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

ఇక, మే 4వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల సమీపంలోని బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వ్యవసాయ భూమిలోని షెడ్డులో తేజస్విని ఉరి వేసుకుని మృతిచెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆత్మహత్యగా కేసు నమోదు చేయగా.. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రమే సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సాదిక్‌ను అరెస్ట్ చేశారు. 

తేజస్విని, సాదిక్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ధర్మవరం డీఎస్పీ చెప్పారు. బాలికను సాదిక్ తన వ్యవసాయ భూమికి తీసుకెళ్లాడని.. ఇద్దరూ అక్కడ ఉన్న షెడ్ వద్ద రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సాదిక్ ఇద్దరికీ భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్లగా.. కి తేజస్విని షెడ్డు వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. అయితే తేజస్విని కుటుంబ సభ్యులు మాత్రం అత్యాచారం చేసి, హత్య చేశారని ఆరోపిస్తున్నారు. 

కుటుంబ సభ్యుల అనుమానం, రాజకీయ విమర్శల నేపథ్యంలో.. తేజస్విని మృతదేహానికి శుక్రవారం పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత తేజస్వినిది ఆత్మహత్యేనని, అత్యాచారం, హత్య జరిగిన దాఖలాలు లేవని డాక్టర్లు చెప్పారు. మృతురాలు మెడపై గాయం గుర్తులు ఉన్నాయని చెప్పారు. శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కూడా వైద్యులు చెప్పిన విషయాన్ని ధ్రువీకరించారు. 

అయితే కుటుంబ సభ్యులు మాత్రం నిష్పాక్షంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజస్విని కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ, జనసేన సహా పలు ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తేజస్విని కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చేలా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆందోళనకారులు ఎస్పీ వాహనాన్ని ముందుకు కదలనిచ్చారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. సాదిక్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసును పోలీసులు.. దిశా పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని దిశా డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ రాహుల్ ఆదేశించారు. ఈ క్రమంలోనే నేడు గోరంట్లలో శ్రీనివాసులు విచారణ నిర్వహించనున్నారు.