Vennelavalasa: వెన్నెలవ‌ల‌స గ్రామం వారం రోజుల నుంచి లాక్‌డౌన్ లో ఉంది. త‌మ‌కు తామే లాక్‌డౌన్ విధించుకున్నారు. ఊర్లో ఉన్న ఇండ్ల‌కు తాళాలు ప‌డ్డాయి. గ్రామంలోకి రాకుండా చూట్టు ముళ్ల కంచే వేసుకున్నారు.  

Srikakulam : ఆ గ్రామం వారం రోజులుగా స్వీయ లాక్‌డౌన్ లోకి వెళ్లింది. ఊర్లో వున్నవారు కూడా క‌నిపించ‌కుండా దాక్కున్నారు. ఇండ్ల‌కు తాళాలు వేసుకున్నారు. ఊరంత నిర్మానూష్యంగా మారింది. వేరే గ్రామాల నుంచి ఊర్లోకి రాకుండా ముళ్ల కంచే కూడా వేసుకున్నారు. ఎవరూ మా ఊరు రావద్దు.... మేమెవరమూ మీ ఊరు రామంటూ ప్రకటించారు. ఇటీవ‌క క‌రోనా కార‌ణంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. కొత్త వేరియంట్ల నేప‌థ్యంలో లాక్‌డౌన్ లోకి జారుకోవ‌డానికి ప‌లు దేశాలు సిద్ధ‌మ‌వుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. అలాంటి మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆ ఊరంతా లాక్‌డౌన్ లోకి వెళ్లిందా? అంటే కాదు. మ‌రీ ఎందుకు ఇలా ఆ గ్రామ ప్ర‌జ‌లు లాక్ డౌన్ విధించుకున్నారో తెలియాలంటే.. అక్క‌డ జ‌రిగిన పూర్తి స్టోరీ లోకి వెళ్లాల్సిందే.. ! 

క‌రోనా మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డి ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ విధిస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వెన్నెల వ‌ల‌స గ్రామం మాత్రం దుష్ట‌శ‌క్తుల‌కు భ‌య‌ప‌డి స్వీయ లాక్‌డౌన్ విధించుకుంది. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా వారం రోజులు లాక్‌డౌన్ విధించుకుంది. చంద్రునిపై మేడ‌లు క‌ట్టే స్థాయిలో మాన‌వుడు చేరుకుంటున్న క్ర‌మంలో ఇంకా మూఢ‌న‌మ్మ‌కాల‌తో ఇలా దుష్ట‌శ‌క్తుల‌కు భ‌య‌ప‌డి లాక్‌డౌన్ లోకి వెళ్ల‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. వివ‌రాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామం ప్ర‌జ‌లు దుష్ట‌శ‌క్తుల పేరుతో ఊరంతా లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇండ్ల‌ను బ‌య‌ట‌కు రాకుండా ఉన్నారు. ఆ ఊర్లోకి ఎవ‌రూ అడుగుపెట్ట‌కుండా ముళ్ల‌కంచే కూడా వేసుకున్నారు. 

గత కొన్ని రోజులుగా ఆ గ్రామంలోని ప్ర‌జ‌లు తీవ్ర‌మైన జ్వ‌రాల బారిన‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ప్రాణాలు కూడా కోల్పోయారు. మ‌రికొంద‌రి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. అయితే, దీనికి ప్ర‌ధాన కార‌ణంగా ఊర్లోకి ద‌య్యాలు, దుష్ట‌శ‌క్తులు రావ‌డ‌మేన‌ని ఆ గ్రామ ప్ర‌జ‌లు న‌మ్మారు. ఈ మూఢ‌న‌మ్మ‌కాల‌తో చాలా ఏండ్ల క్రితం మొద‌లు పెట్టిన ఓ విచిత్ర ఆచారాన్నిమ‌ళ్లీ షురు చేశారు. ఆ ఊర్లో వ‌చ్చిన దుష్ట‌శ‌క్తుల‌ను త‌రిమేయ‌డం కోసం లాక్‌డౌన్ విధించుకున్నారు. ఊర్లో క్షుద్ర‌పుజ‌లు చేయ‌డం ప్రారంభించారు. ఊరి పొలిమేర పొలాల్లో నాలుగు రాళ్ళు ప్ర‌తిష్ఠించారు. వాటి కింద కొబ్బరి బొండం, ప్రతీ ఇంటి నుంచి పిడికెడు బియ్యం, చింతపండు, అరటిపండు, కందిపప్పు, నల్ల జీడిపిక్కలు ఆ భూమిలో పాతి దానిమీద నిమ్మకాయ, రాయి పెట్టి 9 రోజుల పాటు ఈ తంతును కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి 25 వ‌ర‌కు ఈ ఈ త‌తంగం కొన‌సాగించారు. 

గ్రామ‌స్తులు నిర్వ‌హిస్తున్న ఈ క్షుద్ర‌పూజ‌లు, ఈ మూఢ‌న‌మ్మ‌క ఆచారం గురించి ఆధికార యంత్రాంగంతో పాటు పోలీసుల‌కు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు ఆ గ్రామాల ప్ర‌జ‌ల‌కు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మూఢ‌న‌మ్మ‌కాల నుంచి వారిని బ‌య‌ట‌ప‌డేయ‌డానికి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. మూఢనమ్మకాలపై ఈ ఊరి ప్రజలకు అవగాహన కల్పించడానికి రానున్న రోజుల్లో కళాజాత నిర్వహిస్తామని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.