మరో ఐదురోజులు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఇదీ...: విశాఖ వాతావరణ కేంద్రం
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు చెదురుమదురు జల్లులే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
విశాఖపట్నం: కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు ప్రస్తుతం తెరిపినిచ్చాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగస్ట్ 3వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురు జల్లులే తప్ప భారీ వర్షాలకు కురిసే అవకాశం లేదని తెలిపారు. భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో లేవని వాతావరణ శాఖ తెలిపింది.
బెంగాల్ రాష్ట్రంలోని గంగానది తీరం మీదుగా అల్పపీడనం కొనసాగుతున్నందున ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు పోరాదని... మరీ ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలోకి పోరాదనీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అల్పపీడన ప్రభావం ఒడిషా వరకు ఉన్నందున ఆ రాష్ట్రానికి సరిహద్దుల్లో గల తెలుగు మండలాల్లో వర్షాలు పడవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
read more భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ...
ఇక ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రవహించడంతో పాటు జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కొద్దిరోజులు వర్షాలు ఆగినప్పటికి ఎగువ నుండి భారీ వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు జలాశయం గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువన గల నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. 2007 తర్వాత జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి.
ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది.