ముఖ్యమంత్రులైనంత మాత్రాన తప్పించుకోలేరు... : అంబటి సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రులైనా, ఎంతటి ధనవంతులైనా చట్టం నుండి తప్పించుకోలేరని అన్నారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం వెనుక టిడిపి చీఫ్ చంద్రబాబు కుట్ర దాగివుందని అధికార వైసిపి ఆరోపిస్తోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. వైసిపి ఒంటరిగా ఎదుర్కోలేకే అన్ని పార్టీలతో కలిసి ఫైట్ చేయాలని చూస్తున్నాడని... అందులో భాగంగానే షర్మిలకు పిసిసి బాధ్యతలు ఇప్పించాడని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గుప్పిట్లో వుందని ... ఆయనే ఇరురాష్ట్రాల పిసిసి అధ్యక్షులను నియమిస్తున్నాడని రాంబాబు అన్నారు.
వైసిపి ఓడించడం తనవల్ల కాదని చంద్రబాబుకు అర్థమయ్యింది... అందువల్లే అందరూ కావాలని అనుకుంటున్నాడని రాంబాబు అన్నారు. సింగిల్ గా నిలబడితే కనీసం డిపాజిట్లు కూడా రావనే పొత్తులు పెట్టుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, బిజెపి కావాలనుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరయ్యారని అన్నారు. ఇలా వైఎస్ షర్మిలకు ఏపి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం వెనక టిడిపి అధినేత చంద్రబాబు వున్నారని అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబు ఆండ్ కో వైట్ కాలర్ క్రిమినల్స్ అని అంబటి మండిపడ్డారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుని ఎవరి వాటా వారు పంచుకునేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు. వీరి దోపిడీకి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారు... సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతున్నారని అన్నారు. అవినీతిని బయటపెట్టి జైల్లో పెడితే ప్రజల్లో సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ధనమదంతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు లాంటివారిని ప్రజలు నమ్మరని ... వారికి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి రాంబాబు హెచ్చరించారు.
Also Read స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?
ముఖ్యమంత్రులైతేనో, ధనముంటేనో చట్టానికి అతీతులు కాదనేది గుర్తుంచుకోవాలని అంబటి అన్నారు. పవర్ఫుల్ లేడీ జయలలిత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చట్టం సంకెళ్లు వేసి తీసుకెళ్లిందని గుర్తుచేసారు. కాబట్టి చట్టం ముందు చంద్రబాబైనా, చినబాబైనా ఒక్కటే... ఎవ్వరూ తప్పించుకోలేరని అంబటి హెచ్చరించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు శిక్ష పడటం ఖాయం ... తప్పించుకునే అవకాశమే లేదని రాంబాబు అన్నారు. అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబును నిర్దోశిగా చూపించేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ న్యాయస్థానాల్లో చంద్రబాబు అసలు రంగు బయటపడుతుందని అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టారు కాబట్టి విచారణకు అర్హత లేదన్న చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. స్కిల్ కేసులో విచారణను కొనసాగించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపిందని అంబటి రాంబాబు గుర్తుచేసారు.
చంద్రబాబుపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతున్నారు కానీ ప్రజలు చంద్రబాబునే క్వాష్ చేశారని గుర్తించలేకపోతున్నారని అంబటి ఎద్దేవా చేసారు. 2024 ఎన్నికల్లో మరోసారి టిడిపిని, చంద్రబాబును ప్రజలు క్వాష్ చేయబోతున్నారని అన్నారు. ప్రజా న్యాయస్థానంలో చంద్రబాబు దోషిగా తేలిపోయాడని... ఆయన వేషాలు, అవినీతి భాగోతం బయటపడిందని అంబటి రాంబాబు అన్నారు.