జనసేన నయా జోష్ ...పక్కా ప్లాన్ తో పవన్ కల్యాణ్ పవర్ పాలిటిక్స్..!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ పార్టీలో నయా జోష్ నిండింది.
![Andhra Pradesh Election 2024 ... Joinings Continued to Pawan Kalyans Janasena Party AKP Andhra Pradesh Election 2024 ... Joinings Continued to Pawan Kalyans Janasena Party AKP](https://static-ai.asianetnews.com/images/01hbtksxtgcfaw5xhw0mkejhz1/pavan-jpg_363x203xt.jpg)
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవడంతో ప్రధాన పార్టీల నాయకుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ క్రమంలో టికెట్ కోసం కొందరు, రాజకీయ భవిష్యత్ కోసం మరికొందరు పార్టీలు మారుతున్నారు. ఇలా ఓ పార్టీని వీడి మరో పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఇలా జనసేన పార్టీలో కూడా ఇప్పటికే పలువురు నాయకులు చేరగా తాజాగా ప్రజారాజ్యంలో పనిచేసి ప్రస్తుతం రాధారంగ మిత్రమండలి సభ్యునిగా పనిచేస్తున్న బాడిత శంకర్ జనసేనలో చేరనున్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ(బుధవారం) బాడిత శంకర్ తో పాటు మరికొందరి చేరిక కార్యక్రమం వుండనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో శంకర్ వైసిపి కండువా కప్పుకోనున్నారు. భారీ అనుచరులతో కలిసి శంకర్ జనసేనలో చేరనున్నారు.
ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అధికార పార్టీని వీడి జనసేనలో చేరారు. తన అనుచరులతో కలిసి పవన్ సమక్షంలోనే ఆయన కూడా వైసిపి కండువా కప్పుకున్నారు. వంశీకృష్ణ కూడా గతంలో ప్రజారాజ్యంలో పనిచేసారు. ఇలా ప్రజారాజ్యం పార్టీలో తనతో కలసి పనిచేసిన నాయకులను ఒక్కొక్కరుగా చేర్చుకుంటూ వైసిపిని బలోపేతం చేసుకుంటున్నారు పవన్ కల్యాణ్.
ఇప్పటికే వైసిపి ప్రకటించిన ఇంచార్జీల లిస్ట్ లో చోటుదక్కని నాయకుల్లో కొందరు జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇలా జనసేన రాజకీయ వ్యవహారాలు చూసుకునే నాదెండ్ల మనోహర్ తో చాలామంది నాాయకులు టచ్ లో వున్నట్లు తెలుస్తోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం జనసేనలో చేరికకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కల్యాణ్ వైసిపి నాయకుల చేరికపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read Telugudesham Party : కొత్త సంవత్సరంలో సరికొత్త జోష్ ... 'రా... కదలిరా' అంటూ ప్రజల్లోకి చంద్రబాబు
ఇలా ఓ వైపు చేరికల ద్వారా జనసేన పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు పవన్ కల్యాణ్. ప్రజల మధ్యకు వెళ్లి ప్రజాధరణ కలిగిన నాయకులను గుర్తించి వారికే అవకాశం ఇవ్వాలని జనసేనాని చూస్తున్నారు. ఇందుకోసం మొదట కాకినాడ, భీమవరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రేపటి నుండి వారం రోజులపాటు ఉభయ గొదావరి జిల్లాలో పవన్ పర్యటన ఖరారయ్యింది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో వుంది... కాబట్టి అన్ని స్థానాల్లో పోటీచేసే అవకాశం లేదు. కాబట్టి జనసేన పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా వుంది కాబట్టి ఇక్కడే అత్యధిక సీట్లను ఆశిస్తోంది. అందులో భాగంగానే ముందుగా అభ్యర్థుల వేటలో పడ్డారు పవన్ కల్యాణ్.