ప్రజాస్వామ్య మనుగడకు ఏపీలోని వైకాపా, కేంద్రంలోని బీజేపీ సర్కార్లను గద్దె దించాల్సిందే..: సీపీఐ నారాయణ
Vijayawada: వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించితేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గద్దె దించాలని తెలిపారు.
CPI national secretary K Narayana: దేశంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగాలంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలను గద్దెదించాలని సీసీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు. దీని కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
వివరాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్లు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని నారాయణ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో నారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించక తప్పదన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకుల పాలనలో విచక్షణారహితంగా ఇసుక, మైనింగ్ దోపిడీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారనీ, అయితే గత మూడేళ్లలో అవినీతి చాలా రెట్లు పెరిగిపోయిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ గతంలోనే ప్రస్తావించారనీ, విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన జనసేన అధినేత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని సీపీఐ నారాయణ ఆరోపించారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. రాజకీయ ఉద్దేశాలతోనే టీఆర్ఎస్ నేతలపై బీజేపీ దాడులు చేస్తోందన్నారు. బీజేపీ, వైఎస్సార్సీపీల అరాచకాలను అరికట్టాలనీ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ఐక్యంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ నాయకత్వం వహించాలని సూచించారు.
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ బలంగా పోరాడుతున్నదనీ, బీజేపీ ప్రభుత్వ అణచివేత విధానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోరాడుతున్నదని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైకాపా, టీడీపీ, జనసేన వంటి పార్టీలు బీజేపీ, దాని ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడటం లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై జరుగుతున్న దాడులను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. దేశంలో గవర్నర్ల పాత్రకు వ్యతిరేకంగా సీపీఐ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతుందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, తమ రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర కారణంగా నష్టపోతున్నాయన్నాయని పేర్కొన్నారు.
అంతకుముందు, స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించిన సీపీఐ నారాయణ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను అమ్మకుండా ఆపడానికి చేతకాకుండా పోయింది.. ప్రత్యేక హోడా ఇవ్వలేకపోయాడు.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేకపోయాడు.. పోలవరం నిధులు అటకెక్కిపోయాయి అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.