ఏడాది పాలన పూర్తి: ఆగష్టు నుండి జగన్ పల్లె బాట
ఏడాది పాలన పూర్తి చేసుకొన్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది ఆగష్టు మాసం నుండి రాష్ట్రంలో పర్యటించాలని భావిస్తున్నారు.
అమరావతి: ఏడాది పాలన పూర్తి చేసుకొన్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది ఆగష్టు మాసం నుండి రాష్ట్రంలో పర్యటించాలని భావిస్తున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రెండు పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో సుమారు 90 శాతం వాగ్దానాలను అమలు చేసినట్టుగా వైసీపీ నేతలు ప్రకటించారు.
also read:బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వ పనితీరును తెలుసుకొనేందుకు జగన్ గ్రామాల్లో పర్యటించాలని భావిస్తున్నారు.
ఈ ఏడాది ఆగష్టు మాసంలో గ్రామాల్లో పర్యటించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతరత్రా లబ్ది ప్రజలకు చేరుతోందా లేదా అనే విషయాలను ప్రజల నుండి జగన్ తెలుసుకొంటారు.
అర్హులకు పథకాలు అందకపోతే అధికారులను బాధ్యులను చేస్తానని సీఎం జగన్ హెచ్చరించారు. పెన్షన్, ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల వంటివి అర్హులైన పేదలకు అందాలని ఆయన ఆదేశించారు.
అన్ని వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్నపథకాలను పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఏ రకంగా అమలు జరుగుతున్నాయనే విషయాన్ని నేరుగా పరిశీలించేందుకు జగన్ గ్రామాల పర్యటనను ఎంచుకొన్నారు.మంచి ఉద్దేశ్యంతో పథకాలను అమలు చేస్తున్నా గ్రామ స్థాయిల్లో ఆ పథకాల అమలు తీరు ఎలా ఉందో తెలుసుకొనేందుకు ఈ పర్యటనను ఆయన ఎంచుకోనున్నారు.
ఏడాది పాటు గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను సమీక్షిస్తూనే కొత్త పథకాలకు జగన్ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయాలు తీసుకొన్నారు.
తాజాగా ఏపీ ఫైబర్ నెట్, రంజాన్ తోఫా లాంటి స్కీమ్ లలో అవినీతి చోటు చేసుకొందని కేబినెట్ సబ్ కమిటి నివేదిక ఇచ్చింది. ఈ స్కీమ్ లపై సీబీఐ విచారణ చేయాలని ఏపీ కేబినెట్ ఈ నెల 11వ తేదీన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.