ఆంధ్రాకి లోకేశ్ ’మేధస్సే‘ దిక్కు
నిప్పు కొడుకు పిడుగు అని మరొక సారి రుజువయింది ఆంధ్రదేశంలో
లోకేశ్ గురించి మొన్నటి దాకా చాలా మందికి పెద్దగా తెలియదు.
ఇంటి దొంగనేకాదు, ఇంటి మేధావి ని గుర్తించడం కూడా కష్టమని ఆయన మేధోచరిత్ర స్పష్టంగా రుజువు చేస్తుంది.
తెలుగు దేశం వాళ్లు ఆయన ముద్దు ముద్దుమాటలను అందరికి వినిపించేందుకు అనేక ట్రయినింగ్ క్లాస్లు లు ఏర్పాటుచేశారు. అపోజిషనోల్లు,సోషల్ మీడియా ఆయన ముద్ద ముద్దగా మాట్లాడతాడని తెగు జోకులేశారు. అందరికీ బుద్ధి వచ్చేలా తాను బాలమేధావి అని ఆయన మరొక సారి రుజువు చేసుకున్నాడు. 14 కోట్లను అయిదు నెలల్లో 334 కోట్లు చేశాడు.
ఎగతాళి చేయడం మానేసి, చేతనైతే ఆ లెక్కేదో కనుక్కోండి. కాల్ క్యులేటర్లు, కంప్యూటర్లు, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు కూడా వాడుకోండి. అభ్యంతరం లేదు.
చాలా మంది హైస్కూల్ పిల్లకాయలకు చల్లాడం కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. ప్రధాని మంత్రిని ఎలా ఎన్నుకుంటారో అసలు తెలియదు.
అట్లాంటపుడు , పరిగెత్తుకుంటూ వస్తున్న ప్రధాన మంత్రి పదవి అందుకుందామని వాళ్ల నాయన చేతులు చాపాలనుకుంటున్నపుడు ‘ఆగు, అది అశాశ్వతం, నీ హోదాకు ప్రధాని కంటే ముఖ్యమంత్రే ముఖ్యం. నీ సేవలు ఆంధ్రలో చాలా అవసరం,’ అని ఆకాశవాణిలాగా పొలిటికల్ ఫిలాసఫీ చెప్పి తండ్రి కళ్లు తెరిపించిన పిడుగు.
అప్పటికింకా స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లాలన్న ఆలోచననే రాని పసితనం ఆయనది.
అబ్బడు నిప్పయితే, కొడుకు పిడుగు.
అంతేకాదు,ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నపుడు నాయనకు ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేయించింది, అందులోఅనేక కొత్త కొత్త హామీలను జోడించింది కూడా ఈయనే నని టిడిపిలో గుసగుసలు పోవడం మనకు తెలుసు.
ఇపుడు అయిదు నెలల కాలంలో తనకున్న రు. 14.5 కోట్లును 334 కోట్లు చేశానని దాచుకోకుండా చెప్పడం అంటే పిడుగు అని నిరూపించుకోవడమే.
ఇది మామూలు రికార్డు కాదు.
ఎందుకంటే, ఎమ్మెల్యేల ఆస్తులు పెరగడం మామూలేనని ప్రజలకు తెలుసు.
దీనికి తాజా సాక్ష్యం 2017 ఎన్నికల కోసం ప్రకటించిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ్యుల ఆస్తులే. ఆ రాష్ట్రంలో 2012 నుంచి 2107 అసెంబ్లీ ఎన్నికల నాటికి సిటింగ్ ఎమ్మెల్యేల అస్తులు పెరిగింది కేవలం 82 శాతమే. ఆ మాత్రం పెరక్కపోతే, అన్ని తంటాలు పడి ఎమ్మెల్యే కావడం ఎందుకు?
వీళ్ల ఆస్తి 2012 ఎన్నికల్లో రూ. 3.49 కోట్లు (రూ. 3,49,08,073) ఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల నాటికి రూ. 6.33 కోట్ల (రూ. 6,33,64,781)కు పెరిగిందని ‘ఎలెక్షన్ వాచ్’ సంస్థ లెక్క కట్టింది. 2012లో పోటీచేసి గెల్చి, ఎమ్మెల్యేగా అయిదేండ్లుండి ఇపుడు 2017లో మళ్లీ పోటీ చేస్తున్న 311 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 2.84 కోట్లు పెరిగిందని వాళ్లు నిన్న ప్రకటించారు.
కాని, పదవేదీ లేకుండా, సంపాదన పెద్దగా లేని ఒక ‘మధ్య తరగతి ’ ముఖ్యమంత్రి కుమారుని ఆస్తి అయిదు నెలల కాలంలో పద్నాలుగున్నర కోట్లనుంచి 334 కోట్లకు పెరిగిదంటే, దీని వెనక వున్న బ్రెయిన్స్ కు నమస్కారం పెట్టాల్సింది.
ఇలాంటి మేధావి ఇపుడు పెద్ద మనిషయ్యాడు. ఆయన పెద్దల సభలో కాలుమొపుతున్నాడు. గర్వపడాలి.
2014 లో ముఖ్యమంత్రి అయినప్పటినుంచి చంద్రబాబు నాయుడు చెబుతున్నది ఒక్కటేమాట: 2019 నాటికి రాష్ట్రం దేశంలోని మేటి అయిదు రాష్ట్రాలలో ఒకటవుతుంది. 2029 నాటికి నెంబర్ వన్ అవుతుంది, 2050 నాటికి ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ (ఎకనమిక్ సూపర్ పవర్ )లలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటవుతుంది.
ముఖ్యమంత్రి రోజూ ఒక సారి రాష్ట్ర ప్రజలకు ఈ విషయం గుర్తు చేస్తునే ఉన్నారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా...
తన వెనక లోకేశ్ మేధస్సు ఉందనే ధైర్యమే దీనికి కారణం కావచ్చు.
కొడుకు రాజకీయాల్లోకి వస్తాడని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతాడనే ముఖ్యమంత్రి విజన్ 2029 రూపొందించి ఉంటారని అనిపిస్తూ ఉంది.
2016 అక్టోబర్ లో లోకేశ్ స్వయంగా తన ఆస్తి రు. 14.5 ప్రకటించారు. ఇపుడు 334 కోట్లని అఫిడవిట్ వేశారు. రాష్ట్రం అభివృద్ధి రేటు ( జిఎస్ డిపి) కూడా లోకేశ్ ఆస్తిలాగా పెరిగి, 2051 నాటి ఆంధ్ర సూపర్ పవర్ అవుతుందేమో!