నేను తప్పు చేశాను
- ‘నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయవద్దు’..ఇవి తాజాగా యాంకర్ ప్రదీప్ జనాలకు చేసిన అప్పీల్
‘నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయవద్దు’..ఇవి తాజాగా యాంకర్ ప్రదీప్ జనాలకు చేసిన అప్పీల్..మొన్న డిసెంబర్ 31వ తేదీ మద్యం తాగి కారు నడుపుతూ యాంకర్ పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. పట్టుబడినపుడు తప్పించుకునేందుకు ప్రదీప్ పెద్ద సీనే క్రియేట్ చేసారు. అయితే, పోలీసులు లొంగకపోవటంతో తప్పని పరిస్ధితుల్లో నిబంధనలను పాటించారు. దాంతో మోతాదుకు మించి యాంకర్ మద్యం తీసుకున్నట్లు తేలింది. దాంతో చేసేది లేక తన కారును అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.
తర్వాత పోలీసులు నిర్వహించిన కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సిన ప్రదీప్ అప్పటి నుండి అడ్రస్ లేరు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆచూకి కనుక్కోలేకపోయారు. ఆ విషయమే ఇపుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ‘మద్యం సేవించి వాహనాలు నడపవద్దు’ అంటూ పలువురు సెలబ్రిటీలతో పోలీసులు జనాలకు అప్పీల్ చేయించారు. వారిలో ప్రదీప్ కూడా ఒకరు. దాంతోనే విషయం సంచలనంగా మారింది. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు మద్యం తాగి పోలీసులకు దొరికిపోయినా ఇంత సీన్ చేయలేదు.
ఇక ప్రస్తుతానికి వస్తే ఐదు రోజులుగా ప్రదీప్ పోలీసులకు అందుబాటులో లేకపోవటంతో ప్రసార సాధనాలు, సోషల్ మీడియాలో అదే పెద్ద విషయమైపోయింది. దానిపై ప్రదీప్ లేటెస్టుగా స్పందించారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించారు. ‘మందు తాగా కారు నడపటం తప్పే’ అంటూ అంగీకరించారు. ‘తాను చేసిన తప్పు ఇంకెవరూ చేయవద్ద’న్నారు. ‘షూటింగ్ ల బిజీలో ఉండటం వల్లే తాను పోలీసులకు అందుబాటులో లేన’ట్లు తెలిపారు. పోలీసుల నోటీసుల ప్రకారం అన్నీ నిబంధనలు పాటిస్తానని ప్రకటించారు. బిజీ వల్లే ఫోన్లు కూడా తీసుకోలేకపోయినట్లు చెప్పుకున్నారు. న్యాయప్రకారం ఫాలో అవ్వాల్సిన ప్రొసీడింగ్స్ ను ఫాలో అవుతానంటూ చెప్పారు.