అనంతపూర్ టిడిపి నాయకులు జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అనంతపురం: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి తనయుడు, టిడిపి నాయకులు జెసి పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా పవన్ ను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు ప్రయత్నించగా టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టిడిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రంలో మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇలా పవన్ కుమార్​ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించే క్రమంలో తెదేపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

పోలీసు వాహనం ముందుకెళ్లకుండా టిడిపి కార్యకర్తలు అడ్డగించారు. అడ్డుకున్న కార్యకర్తలను పక్కకులాగేసి పవన్ కుమార్ ను పోలీసులు రెండో పట్టణ పోలీసు స్టేషన్​కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనను విడుదల చేశారు. 

పవన్ కుమార్ మాట్లాడుతూ... ర్యాలీ నిర్వహణకు పోలీసులను అనుమతి కోరినా ఇవ్వలేదని జేసీ పవన్ చెప్పారు. వైసిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామనే భయంతోనే తమకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి కేసులు ఎన్ని బనాయించిన భయపడేది లేదన్నారు. అధికారపక్షానికి ఒకలా ప్రతిపక్షాలకు మరోలా పోలీసులు నిబంధనలు అమలు చేస్తున్నారని పవన్ విమర్శించారు.