‘‘ఈసారి కూడా టీడీపీ ఎంపీల విచిత్ర వేషాలు ఖాయం.. బాబు చేయిస్తారు’’
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. సీఎం పథకాలు ప్రచార ఆర్భాటాలకు తప్ప ప్రజలకు ఉపయోగపడవని అన్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. సీఎం పథకాలు ప్రచార ఆర్భాటాలకు తప్ప ప్రజలకు ఉపయోగపడవని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరితే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని.. గతంలో వైఎస్ అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలే ప్రచారం చేసి మళ్లీ ఆయనకే అధికారాన్ని అప్పగించారన్నారు.. ముఖ్యమంత్రిని తాను ప్రవేశపెట్టిన 110 పథకాలు పేర్లు చెప్పాలని.. లేదంటే లోకేశ్తోనైనా చెప్పించాలని అంబటి డిమాండ్ చేశారు.
బీజేపీతో పొత్తుకు వెళ్లను అని చెప్పిన ప్రతీసారి మళ్లీ పొత్తు పెట్టుకున్నారని.. తమ ఎంపీలు రాజీనామాలు చేసిన తర్వాతే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందన్నారు. బీజేపీ తనపై కేసులు పెట్టాలని చూస్తోందని.. వలయంగా ఉండాలని సీఎం ప్రజలను కోరుతున్నారని.. అయితే రహస్యంగానే బీజేపీ మిత్రులతో కలిసి వలయం ఏర్పాటు చేసుకున్నారని రాంబాబు ఆరోపించారు.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత తహతహలాడుతున్నారని.. ఆయనతో సన్నిహితంగా ఉండే ఓ పత్రికాధినేత అమిత్షాతో ముచ్చటించారని.. అలాగే విశాఖ పర్యటనలో ఉణ్న కేంద్రమంత్రి గడ్కరీతో హామీలన్నీ అమలు చేస్తే.. ఇబ్బంది లేదని చంద్రబాబు సంకేతాలిచ్చారని రాంబాబు అన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు.. అక్కడ ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసిన తర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడటం లేదని అంబటి ప్రశ్నించారు.
ఈ పార్లమెంటు సమావేశాల్లో కూడా టీడీపీ ఎంపీల చేత విచిత్ర వేషాలు వేయిస్తారని రాంబాబు ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆయన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేశారని..దీనిపై విచారణ చేయించాలని అంబటి డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ప్రజలే అన్ని కలయికల మీదా తీర్పునిస్తారని రాంబాబు వ్యాఖ్యానించారు.