మా పోరాటాల వల్లే ప్రభుత్వం దిగి వస్తోంది.. ఉద్యమాన్ని ఆపేది లేదు : బొప్పరాజు వెంకటేశ్వర్లు
డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. తాము గతంలో చేసిన పోరాటాల వల్లే ఆర్టీసీలో జీతాల పెంపు, కారుణ్య నియామకాలు జరిగాయని గుర్తుచేశారు.
తమ పోరాటం వల్లే ప్రభుత్వం దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తోందన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. విజయవాడలో జరుగుతున్న ఆర్టీసీ ఈయూ 27వ రాష్ట్ర మహాసభలకు ఆయన హాజరై ప్రసంగించారు. ఏపీ జేఏసీ అమరావతిలో ఆర్టీసీ ఈయూది కీలకపాత్ర అని అన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని బొప్పరాజు స్పష్టం చేశారు. తాము గతంలో చేసిన పోరాటాల వల్లే ఆర్టీసీలో జీతాల పెంపు, కారుణ్య నియామకాలు జరిగాయని వెంకటేశ్వర్లు వివరించారు.
మరోవైపు ఈయూ మహాసభల్లో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇస్తున్నామని.. వీటిని ఎవరికీ కట్టబెట్టడం లేదని ద్వారకా తిరుమలరావు స్పప్టం చేశారు. ఆదాయం పెరిగితే ఆర్టీసీకి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఖర్చులు తగ్గించుకోవడం వల్ల అప్పులు తీర్చగలమని ద్వారకా తిరుమలరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో కాల్ సెంటర్ 149ని అందుబాటులోకి తెచ్చామని.. దీని ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు ఫిర్యాదులు చేయొచ్చిని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.
ALso Read: నాలుగో దశ ఉద్యమానికి ఏపీ ప్రభుత్వోద్యోగులు రెడీ.. సమస్యలు పరిష్కరించే వరకు విశ్రమించం: బొప్పరాజు
ఇదిలావుండగా.. గత ఆదివారం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. డిమాండ్ల సాధన కోసం నాలుగో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు. మే 27న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు తరలివచ్చి జయప్రదం చేయాల్సిందిగా బొప్పరాజు కోరారు. తమ ఉద్యమంలో న్యాయం వుంది కాబట్టే ప్రభుత్వం స్పందిస్తోందని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం ఆగదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.